జయలలిత ఎస్టేట్ లో దోపిడీ కేసు.. మద్రాస్ హైకోర్ట్ సంచలన ఆదేశాలు

  • శశికళ, పళనిస్వామిల విచారణకు అనుమతినిచ్చిన కోర్టు
  • ఎస్టేట్ లో మాయమైన వస్తువుల విషయంలో ప్రశ్నించేందుకు ఓకే
  • జిల్లా కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సీబీసీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఉత్తర్వులు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత ఆమెకు చెందిన ఎస్టేట్ లో పలు విలువైన వస్తువులు మాయమయ్యాయి. కొడనాడు ఎస్టేట్ లో జరిగిన ఈ దోపిడీ కేసులో మద్రాస్ హైకోర్టు తాజాగా సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మాజీ సీఎం పళనిస్వామితో పాటు జయలలిత సన్నిహితురాలు శశికళను విచారించేందుకు అనుమతిచ్చింది. గతంలో వీరిని విచారించ వద్దంటూ జిల్లా కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. సీబీసీఐడీ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించి ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

జయలలితకు సంబంధించిన కొడనాడు ఎస్టేట్ లో 2017 లో సెక్యూరిటీ గార్డ్ ఓం బహదూర్‌ హత్య జరిగింది. ఆపై ఎస్టేట్ లోని పలు విలువైన వస్తువులు కనిపించకుండా పోయాయి. ఈ కేసులో తొలుత పోలీసులు దర్యాఫ్తు జరిపినా ఫలితం లేకుండా పోయింది. కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో డీఎంకే అధికారంలోకి వచ్చాక సీఐడీకి అప్పగించింది. విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు.. ఈ కేసులో ఇప్పటి వరకు 100 మందిని విచారించి 10 మందిని అరెస్టు చేశారు. సీఐడీ దర్యాఫ్తు చేపట్టిన తర్వాత పళనిస్వామి, శశికళ కోర్టును ఆశ్రయించి తమను విచారించకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దీనిపై సీఐడీ అధికారులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పళనిస్వామి, శశికళ, ఇళవరసిలను ప్రశ్నించేందుకు మద్రాస్ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది.

Jayalalitha
Kodanad Estate
Palaniswami
Sasikala
Kodanad Case
Madras HC

More Telugu News